ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని చులకనగా చూడకండి: మల్లు భట్టివిక్రమార్క

  • బడ్జెట్‌లో ఏం తప్పు చేశామని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోందన్న ఉపముఖ్యమంత్రి
  • కుటుంబ పెద్ద మరణిస్తే ఆర్థిక సమస్యలు ఉండకూడదని బీమా సౌకర్యం కల్పించామన్న భట్టి
  • ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా పని చేస్తున్నామని వెల్లడి
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని చులకనగా చూడవద్దని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క విజ్ఞప్తి చేశారు. బడ్జెట్‌లో తాము ఏం తప్పు చేశామని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా శాసనసభలో ఆయన మాట్లాడుతూ, విద్యార్థులకు ఉదయం అల్పాహారం ఇవ్వడం పట్ల కూడా ప్రతిపక్షం ఓర్వలేకపోతోందని విమర్శించారు. కుటుంబాలకు బీమా సౌకర్యం కల్పించడం నేరమా అని నిలదీశారు.

కుటుంబ పెద్ద మరణిస్తే ఆర్థిక సమస్యలు ఉండకూడదనే ఉద్దేశంతో బీమా సౌకర్యం కల్పించామని వెల్లడించారు. సంక్షేమ పథకాల గురించి వివరిస్తుంటే బీఆర్ఎస్ వారికి వినడానికి కూడా సమయం లేనట్లుగా ఉందని విమర్శించారు. తాను డిప్యూటీ సీఎం హోదాలో బడ్జెట్ ప్రవేశపెడుతుంటే ప్రతులు చించి సభ నుంచి వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మేం చెప్పింది వినాలి లేదంటే వెళ్లిపోతామన్నట్లుగా బీఆర్ఎస్ సభ్యుల తీరు ఉందని మండిపడ్డారు.

ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. నాడు రైతు బంధు పథకాన్ని బీఆర్ఎస్ ఎన్నికల పథకంగా మార్చుకుందని ఆరోపించారు. 2018లో ప్రజలు ఓట్లు వేయడానికి వరుసలో నిలబడిన సమయంలో రైతు బంధు నిధులు జమ చేశారని ఆరోపించారు. కానీ తాము రైతు భరోసా నిధులు విడుదల చేసింది ఎన్నికల కోసం కాదని పేర్కొన్నారు. ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తున్నట్లు వెల్లడించారు.

రైతులకు ఉచిత కరెంట్ పేటెంట్ హక్కు కాంగ్రెస్ పార్టీదే అని తెలిపారు. తమ ప్రభుత్వం రాగానే ఒకేసారి రైతు రుణమాఫీ చేశామని అన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని లక్ష్యంగా చేయాలని పెట్టుకున్నామని మల్లు భట్టివిక్రమార్క తెలిపారు.

Mallu BhattiVikramarka
Telangana
Deputy CM
Budget 2024
BRS criticism
Rythu Bharosa
Farmer welfare

More Telugu News